తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. నిన్న 65,756 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 34,774 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల రూపేణా టీటీడీకి రూ.4.65 కోట్లు ఆదాయం వచ్చిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, వీరికి 6 గంటల్లో స్వామి వారి దర్శనం కలుగుతుందని వివరించారు.
టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యం లో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఇవాళ నుంచి 5 వ తేదీ వరకు శ్రీ రామానుజాచార్యుల 1006వ అవతార మహోత్సవాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భగవద్ రామానుజాచార్యులపై సాహితీ సదస్సు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి అనుగ్రహభాషణంతో అవతార మహోత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు.