తిరుమల : ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం, ప్రతిష్ఠాపన కార్యక్రమం రోజున తిరుమల పుణ్యక్షేత్రం నుంచి లక్ష లడ్డూలను ( Laddoos ) టీటీడీ పంపించనుంది. భక్తులకు 25 గ్రాముల బరువు గల లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో (TTD EO) ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన భక్తులతో ఫోన్లో మాట్లాడారు.
సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు. ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15న తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని పేరేడ్ మైదానంలో సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు గోదా కళ్యాణం వైభవంగా నిర్వహిస్తామని అన్నారు.
డిసెంబర్ నెలలో 19.16 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, భక్తుల కానుకల వల్ల రూ. 116.73 కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. కోటి 46 వేల లడ్డూలను, 40.77 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించామని ఈవో తెలిపారు. 6.87 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని ఆయన వివరించారు.
n,