హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం కడప జిల్లా (Cadapa district) జమ్మలమడుగు మండలంలోని మోరగుడి సమీపంలో వృద్ధ జంట దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగప్ప (60), ఓబులమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మరోవైపు ఓబులమ్మ అంగీకారంతో పెద్దక్క (53) తో సుమారు 30 ఏళ్లుగా నాగప్ప సహజీవనం చేస్తున్నాడు.
వారు తాడిపత్రి రహదారిలోని పెద్ద పసుపుల మోటులో ఇటుకల బట్టీలు నడుపుతున్నారు. నాగప్ప, పెద్దక్క తాడిపత్రిలో రహదారిలోని ఇటుకల బట్టీ వద్ద నివాసముంటున్నారు. ఓబులమ్మ తన ఇద్దరు కుమారులతో జమ్మలమడుగు పట్టణంలో ఉంటున్నారు. ఆదివారం ఉదయం నాగప్ప, పెద్దక్క తాడిపత్రి రహదారిలోని ఇటుకల బట్టీలో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు రోకలి బండతో వారి తలలు పగలగొట్టి హతమార్చారు.
హత్యా జరిగిన ప్రదేశం పక్కనే ఉన్న గదిలోగల బీరువాలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ హత్యలు డబ్బు కోసమా జరిగాయా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.