AP News | ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మరని మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆమె ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
పార్టీ మారేవారంతా జీరోలుగానే మిగిలిపోతారని మేరుగు నాగార్జున సెటైర్ వేశారు. ఇటీవల జనసేనలో చేరిన పృథ్వీరాజ్ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. పృథ్వీ ఏనాడూ వైసీపీ జెండా మోయలేదని తెలిపారు. కాగా, ఒంగోలులో సంతనూతలపాడు వైసీపీ నేతల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జునకు సహకరించాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. బాలినేని విజ్ఞప్తితో కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న నేతలు కూడా కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. సంతనూతలపాడు, కొండపి విషయంలో తనకు చెప్పకుండానే టికెట్లు ఇచ్చారని.. అయితే అసంతృప్తితో రాజీనామా చేయడానికి ఒక సెకను పట్టదని అన్నారు. కానీ ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని.. అన్ని సమస్యలు సామరస్యంగానే పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని వైసీపీ అభ్యర్థులు అందరూ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.