విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైవేలకు మహర్దశ పట్టింది. ఇతర రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తున్న కేంద్రం.. ఏపీలో మాత్రం జాతీయ రహదారుల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. రాష్ట్రంలోని దాదాపు 31 హైవేలను నిర్మించేందుకు రూ.10 వేల కోట్లు నిధులు ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ.. ఇప్పటికే రూ.11 వేల కోట్లకుపైగా ఖర్చుతో 20 రోడ్లను నిర్మించింది. మొత్తం 51 రోడ్లు ఒక్క ఏపీలోనే నిర్మించడం ద్వారా ఇతర రాష్ట్రాలపై తమ సవతి ప్రేమను చాటారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.10,401 కోట్లతో మొత్తం 741 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారులను నిర్మించనున్నారు. 31 రోడ్లకు ఈ నెల 17న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రూ.11,157 కోట్లతో నిర్మించిన 20 రోడ్లను ప్రారంభించాల్సి ఉన్నది. రాష్ట్రంలోని మొత్తం 51 రోడ్లు అధ్వానంగా ఉన్నాయని గుర్తించిన కేంద్ర రవాణా శాఖ.. ఆ మేరకు నిధులు కేటాయించి పనులు పూర్తిచేయడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. కాగా, నితిన్ గడ్కరీ పర్యటన సందర్భంగా అదే రోజు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
రాష్ట్రంలోని పోర్టులు, పర్యాటక ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను కలుపుతూ రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చేసిన వినతి మేరకు వేల కోట్లు నిధులు కేటాయించారు. దీని వల్ల ఏపీలో పారిశ్రామిక, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని జగన్ ప్రభుత్వం అభిప్రాయపడుతున్నది.