అమరావతి : పెరుగుతున్న కరోనా కేసుల మధ్య ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ కట్టడికి రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి జనవరి 31 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా నేటి రాత్రి 11 గంటల నుంచి అమలులోకి రానుండగా.. మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కొనసాగనున్నది. అలాగే సందర్భంగా కొత్త నిబంధనలు సైతం అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం ప్రజలంతా మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. రూల్స్ బ్రేక్ చేసిన వారికి రూ.1000 జరిమానా విధించనున్నారు.
వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల విషయానికొస్తే బహిరంగ ప్రదేశాల్లో అయితే గరిష్ఠంగా 200 మంది, ఇన్డోర్లో 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఆయా కార్యక్రమాలకు హాజరయ్యే వారంతా కొవిడ్ నిబంధనలను విధిగా పాటించాలి. సినిమా హాళ్లలో సీటు వదిలి సీటు విధానాన్ని పాటిస్తూనే మాస్క్ ధరించడంతో పాటు ప్రజారవాణా వాహనాల్లో సిబ్బందితో పాటు, ప్రయాణికులూ మాస్క్ పెట్టుకోవాలని చెప్పింది. వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు తమ ఆవరణలో ఉన్న వారంతా మాస్క్లు ధరించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
లేకుంటే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే జరిమానాతో పాటు ఒకటి లేదా రెండు రోజులపాటు షాపులు, మార్కెట్లు మూసివేసేలా చర్యలు చేపట్టనున్నారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, మతపరమైన ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని, భౌతిక దూరం, మాస్క్లు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. కర్ఫ్యూ నుంచి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ సర్వీసులు, దవాఖానలు, మెడికల్ ల్యాబ్లు, ఫార్మసీ, ప్రసార సేవలు, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బందికి మినహాయింపు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
అలాగే అత్యవసర విధుల్లో ఉండే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందిని కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వగా.. విధి నిర్వహణలో గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది. గర్భిణులు, చికిత్స పొందుతున్న పేషెంట్లు.. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించే వారు సంబంధిత ఆధారాలు, ప్రయాణ టికెట్లు చూపించి తద్వారా ప్రయాణాలు చేయొచ్చని చెప్పింది. అంతర్రాష్ట్ర, రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపు మినహాయింపు ఇచ్చింది.