Kotamreddy Sridhar Reddy | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా బూటకమని రామశివారెడ్డి చేసిన వ్యాఖ్యలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఖండించారు. రామశివారెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడని.. ఆయన ఇలా మాట్లాడతాడని ముందే ఊహించానని చెప్పుకొచ్చారు. రామశివారెడ్డిది ఐఫోన్ అని మరోసారి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పునరుద్ఘాటించారు. మీడియాకు మాత్రం ఆండ్రాయిడ్ ఫోన్ చూపించి తప్పుదారి పట్టించారని అన్నారు. అది ఫోన్ ట్యాపింగ్ కాకుండా.. కాల్ రికార్డింగ్ అయితే మీడియాకు ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభుత్వానికి విచారణ కోరే ధైర్యం లేదని విమర్శించారు. తనది తప్పని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు.
అంతకుముందు ఫోన్ ట్యాపింగ్పై కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడని రామశివారెడ్డి ఆరోపించారు. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ కాలేదని.. తన ఫోన్ నుంచే కాల్ రికార్డింగ్ బయటకు వచ్చిందని వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్ గురించి కోటంరెడ్డితో తను ఫోన్లో మాట్లాడనని చెప్పాడు. తనది ఆండ్రాయిడ్ మొబైల్ కావడంతో ఆ కాల్ రికార్డింగ్ ఫోన్లో ఆటోమేటిగ్గా రికార్డయ్యిందని అన్నారు. సదరు కాంట్రాక్టర్ మీద కోటంరెడ్డి ఆగ్రహంగా ఉన్నారనే విషయాన్ని తోటి కాంట్రాక్టర్లకు చెబితే వాళ్లు నమ్మకపోవడంతో తప్పో ఒప్పో వాళ్లకు కాల్ రికార్డు పంపించానని బయటపెట్టాడు.రాజకీయంగా ఇది ఇంత దుమారం రేపుతుందని, జగన్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతుందని అనుకోలేదని చెప్పారు. ఏపీ సీఎం జగన్కు దోషిగా నిలబెట్టడం ఇష్టం లేకనే మీడియా ముందుకొచ్చానని స్పష్టం చేశాడు. దీనిపై కావాలంటే కేంద్ర హోం శాఖ, సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు.
Read More : Mekapati Chandrashekar Reddy | వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు