Mekapati Chandrashekar Reddy | నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి తనకు ఛాతిలో నొప్పి వస్తుందని కుటుంబసభ్యులకు చెప్పడంతో హుటాహుటిన ఆయన్ను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెపోటుగా నిర్ధారించారు.
చంద్రశేఖర్ రెడ్డి పరీక్షించిన అనంతరం ఆయన గుండె రక్తనాళాల్లో రెండు వాల్వ్లు బ్లాక్ అయినట్లు నిర్ధారించారు. యాంజియో పరీక్ష పూర్తయిందని.. మేకపాటికి ప్రమాదమేమీ లేదని వైద్యులు వెల్లడించారు. అయితే మెరుగైన వైద్యం అందించేందుకు మేకపాటిని చెన్నై తరలించేందుకు ఆయన కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
Read More : Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్.. కోటంరెడ్డికి షాకిచ్చిన ప్రాణమిత్రుడు
కాంగ్రెస్ పార్టీలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1999లో తొలిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ వైఎస్సార్ హయాంలో 2004, 2009 ఎన్నికల్లో రెండు సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన మీద అభిమానంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన విజయం సాధించలేదు. కానీ 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కానీ కొంతకాలంగా జగన్ ప్రభుత్వంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.