తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం నవగ్రహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కార్తికమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం కామాక్షి అమ్మవారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టారు.
హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 3 నుంచి 11వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి చండీ యాగం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈవో శ్రీనివాసులు, సూపరింటెండెంట్లు భూపతి, శ్రీనివాసులు,ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.