సంక్రాంతికి ఊరెళ్తున్నానని.. తనకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తనపై 11 పెట్టారని, మరో కేసు కూడా పెట్టే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో సీఐడీ అధికారులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారని.. మరోసారి తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని రఘురామకృష్ణ రాజు తరఫున న్యాయవాదులు ఉమేశ్ చంద్ర, వైవీ రవిప్రసాద్ పిటిషన్ వేశారు. పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.
ఆర్నేశ్ కుమార్ కేసులో 41ఏ నిబంధనలు పాటించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించారు. కాగా, రఘురామ పిటిషన్కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. కేసు నమోదై, ఏడేండ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు అయితేనే 41ఏ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. తాజాగా ఆయనపై ఎలాంటి కేసులు పెట్టలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. శుక్రవారానికి వాయిదా వేసింది.