అమరావతి: వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. మందడంలో రాజధాని రైతులు, మహిళల దీక్ష శిబిరాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా దీక్షాశిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. హైకోర్టు తీర్పుతో ఏపీ ప్రజలకు ఇవాళ ఎంతో శుభదినమన్నారు. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్లనే రైతులకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు.
న్యాయవాదులు, న్యాయమూర్తులు అన్ని విధాలుగా ఆలోచించి రైతుల పక్షాల నిలిచి మంచి నిర్ణయం తీసుకున్నారని సుజనా చౌదరి అభిప్రాపయడ్డారు. ఇది ముమ్మాటికీ రైతుల విజయమని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమ పని తీరును మార్చుకుని రానున్న 20 నెలలైనా ప్రజలకు న్యాయం చేసేలా పాలన అందించాలని కోరుకుంటున్నట్లు సుజన చెప్పారు. రాజధాని అమరావతి అక్కడే ఉంటుందని గతంలో చెప్పానని, అలాగే ఉన్నదన్నారు.
హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే.. అక్కడా రాజ్యాంగబద్ధంగానే తీర్పు వెలువడుతుందని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు తప్పదని ఆయన చెప్పారు. రైతులు దేని గురించి ఆలోచన చెంది బాధపడాల్సిన అవసరం లేదని సూచించారు. ఇవాల్టి కోర్టు తీర్పుతో రైతులు, మహిళలు చేసిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర విజయవంతమైందని చెప్పారు. ఇక జగన్ మనసు మార్చాలని దేవుడిని కోరుకుందామని అన్నారు.