Droupadi Murmu | శ్రీశైలమహాపుణ్యక్షేత్రంలో రూ. 43.08 కోట్లతో ప్రసాద్ స్కీం క్రింద వివిధ అభివృద్ధి కార్యక్రమాలను భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రారంభించారు. శ్రీశైల పర్యటన నేపథ్యంలో సోమవారం ఉదయం 11.45 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సున్నిపెంట హెలిప్యాడ్కు చేరుకున్నారు. అంతకుముందు ద్రౌపది ముర్ముతోపాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, రాష్ట్రపతి కుమార్తె, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డిలకు ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక-శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, ఎస్పీ రఘువీర్ రెడ్డి స్వాగతం పలికారు.
అటుపై శ్రీశైల భ్రమరంబికా మల్లిఖార్జున స్వామి వార్ల దర్శనం కోసం ద్రౌపది ముర్ము మధ్యాహ్నం 12.45 గంటలకు ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్ద ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, దేవదాయ శాఖ కమిషనర్ డాక్టర్ హరి జవహర్లాల్, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈవో లవన్న తదితరుల ఆధ్వర్యంలో దేవస్థాన అర్చకులు, వేద పండితులు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజ గోపురం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
ద్రౌపది ముర్ము తొలుత రత్నగర్భగణపతిస్వామిని దర్శించుకుని హారతి స్వీకరించారు. అటుపై శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకుని రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవార్లకు కుమార్చన జరిపించారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్లను అర్చక స్వాములు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శేష వస్త్రాలను, లడ్డూ ప్రసాదాలను, శ్రీస్వామిఅమ్మవార్ల జ్ఞాపికను ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈఓ లవన్న అందచేశారు.
ఆ తరువాత ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు శ్రీమఠం విరూపాక్షయ్యస్వామి, గురుమహంత్ మహేష్, ఎం. విజయలక్ష్మి, మేరాజోత్ హనుమంత్ నాయక్, ఓ మధుసూదన్ రెడ్డి, బీ పద్మజ, ఎస్ మాధవీలత, డాక్టర్ సీ కనకదుర్గ భారత రాష్ట్రపతికి జ్ఞాపికను అందజేశారు.
నంది సర్కిల్ సమీపంలోని టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్లో ( యాత్రికుల సదుపాయ కేంద్రం) రూ. 43.08 కోట్లతో చేపట్టిన ప్రసాద్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. హాఠకేశ్వరం, శిఖరేశ్వరంలలో ఎమినిటీస్ సెంటర్, శిఖరేశ్వరంలో పుష్కరిణి పునరుద్ధరణ, ఆలయంలో కళాత్మక విద్యుద్ధీకరణ, బస్టాండ్ నుంచి పాతాళగంగ వరకు కృష్ణవేణి రోడ్డు నిర్మాణం, యాంఫీ థియేటర్, ఇల్యూమినేషన్స్ అండ్ సౌండ్ అండ్ లైట్ షో, డిజిటల్ ఇంటర్వెన్షన్, పార్కింగ్ ఏరియా, టాయిలెట్ కాంప్లెక్స్లు, సావనీర్ షాపులు, ఫుడ్కోర్ట్, ఏటీఎం & బ్యాంకింగ్ సేవలు తదితర అత్యాధునిక సౌకర్యాలను భక్తులకు ప్రసాద్ స్కీం క్రింద అందుబాటులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్, ఏపీ టూరిజం ఎండి అండ్ సీఈఓ కన్నబాబు, టూరిస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ డా. వరప్రసాద్ రెడ్డి స్కీం వివరాలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు వివరించారు.
శ్రీశైల మహా క్షేత్రంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సందర్శించారు. వారికి గిరిజన చెంచు విద్యార్థులతో సంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం అధ్యక్షులు టీజీ వెంకటేష్ తదితరులు ద్రౌపది మర్ముకు ఆహ్వానం పలికారు. అటుపై చెంచు మహిళలతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖాముఖి నిర్వహించారు.
గిరిజన మహిళలు గంగమ్మ, వెంకటమ్మ, భ్రమరాంబ, ఉప్పులాపురం గంగమ్మలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇష్టాగోష్టిగా సంభాషించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకొని జీవన విధానాలను మెరుగుపరుచుకోవాలన్నారు. గిరిజన విద్యార్థులతో మాట్లాడుతూ.. వారు ఏయే పాఠశాలల్లో చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు.
శ్రీశైలం పర్యటన ముగించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సాయంత్రం నాలుగు గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్కు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.