Google Data Center | గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. ఢిల్లీలోని మాన్సింగ్ హోటల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు.
ఈ ఒప్పందం ప్రకారం విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ కంపెనీ రూ.88,628 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో వైజాగ్ ఏఐ సిటీగా మారనుంది. 1 గిగా వాట్ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ డేటా సెంటర్ ఆసియాలోనే గూగుల్ సంస్థకు అతి పెద్ద డేటా సెంటర్గా నిలవనుంది. గూగుల్ క్లౌడ్, ఏఐ వర్క్స్, సెర్చ్, యూట్యూబ్ వంటి వాటి కోసం ఈ డేటా సెంటర్ను వినియోగించనున్నారు. ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.