AP News | ఏపీలోని పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆ తల్లి ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. విఠంరాజుపల్లికి చెందిన నక్కా భారతి(24)కు పాల వ్యాన్ డ్రైవర్ సునీల్ రెడ్డితో సుమారు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి తేజేష్ రెడ్డి (6), హేమనాథ నాగిరెడ్డి (4) ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సునీల్ రెడ్డి సోమవారం రాత్రి విధులకు వెళ్లిన తర్వాత భారతి తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి చంపింది. అనంతం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తన భర్త చెడు వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై భార్యాభర్తలకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.