TTD | తిరుమల నడకమార్గంలో తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మరింత పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ, అటవీ, పోలీస్ అధికారులతో ఈవో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చాలా బాధాకరమన్నారు. నడకమార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
నడక మార్గానికి ఇరువైపులా కంచె ఏర్పాటు చేసేందుకు సమగ్ర నివేదిక అందించాలని డీఎఫ్ఓను ఆదేశించారు. చిరుత దాడి ఘటనపై సీపీఎఫ్ నాగేశ్వరరావు అధ్వర్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించి.. చిరుతను బంధించడం కోసం బోనను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నడకదారిలో ఇప్పటికే 30 మంది టీటీడీ భద్రత సిబ్బంది, 10 మంది ఫారెస్ట్ సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. రెండు నడక మార్గాల్లో ఫారెస్ట్, పోలీస్, టీటీడీ కలిసి మరింత ఎక్కువ మందితో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
వందమంది భక్తుల సమూహానికి సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి అనుమతించనున్నట్లు చెప్పారు. నడకదారులలో మధ్యాహ్నం 2-3 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు త్వరలో అటవీశాఖ అధికారులు అందించే నివేదిక ఆధారంగా పటిష్టమైన భద్రత చర్యలు చేపడతామని ఆయన వివరించారు.
చిన్నపిల్లలతో నడక మార్గాల్లో వచ్చే తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఈవో విజ్ఞప్తి చేశారు. సీసీఎఫ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ట్రాంక్విలైజర్స్, బోన్లు వినియోగించి నడక మార్గాల్లో సంచరించే వన్య మృగాలను బంధించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఈ -2 జగదీశ్వర్ రెడ్డి, తిరుమల ఏఎస్పీ ముని రామయ్య, డీఈ ఎలక్ట్రికల్ రవి శంకర్ రెడ్డి, డీఎఫ్ ఓ శ్రీనివాసులు, వీజీవోలు బాల్రెడ్డి పాల్గొన్నారు.