తిరుపతి : ఇటీవల ప్రారంభించిన టీటీడీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ గురించి ఎక్కువ మందికి భక్తులందరికీ తెలిసేలా సమాచార కేంద్రాలు, అనుబంధ ఆలయాల్లో ప్రదర్శించాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బుధవారం టీటీడీ సమాచార కేంద్రాలు, అనుబంధ ఆలయాల అధికారులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్రారంభించిన మొబైల్ యాప్ ను ఒక్క రోజులోనే 10 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు.
మొబైల్ యాప్ గురించి మరింత మంది భక్తులకు తెలియజేసి టీటీడీ సమాచారం, సేవలు, దర్శన టికెట్లు, గదుల బుకింగ్ ను అందుబాటులో ఉంచాలని సూచించారు. భువనేశ్వర్ లో గతేడాది ప్రారంభించిన శ్రీవారి ఆలయంలో నూతన సేవలను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. టీటీడీ సేవలను, ఇతర సమాచారాన్ని ఆలయం వద్ద ప్రదర్శించాలని సూచించారు. పెండింగులో ఉన్న కల్యాణ మండపం పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఉపమాక ఆలయంలో మార్చి మొదటి వారంలో జరగనున్న స్వామివారి కళ్యాణం, అనంతవరంలో ఈ నెలలో జరగనున్న నాలుగు శనివారాల పండుగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జెఈవో చర్చించారు. వెంకటపాలెంలోని ఆలయానికి భక్తుల సంఖ్యను పెంచేందుకు వీలుగా రవాణా వసతి కల్పించేందుకు ఆర్టీసీ అధికారులతో చర్చించాలని కోరారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం, తొండమనాడులోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో త్వరలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని వెల్లడించారు.