అనంతపురం: ప్రముఖ కవి, సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అనంతపురంలో ఘన సత్కారం జరిగింది. తెలుగు సాహిత్యానికి, జానపదాలను కాపాడేందుకు ఆయన చేస్తున్న సేవలను వక్తలు కొనియాడారు. సొసైటీ ఫర్ హ్యూమనిజం అండ్ సోషల్ ఛేంజ్ ఆధ్వర్యంలో అనంతపురంలో శుక్రవారం గోరటి వెంకన్నతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కల్చరల్ క్లబ్ ‘పరివర్తన’ అధ్యక్షుడు డాక్టర్ ఎం సురేష్బాబు అధ్యక్షత వహించి గోరటి వెంకన్న సాహిత్య సేవలను ఆవిష్కరించారు.
తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు తెలిపిన గోరటి వెంకన్న సభికులనుద్దేశించి మాట్లాడారు. నృత్యం, నాటకం, ఆచార వ్యవహారాల్లో సాహిత్యం, సంగీతం ముఖ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాంప్రదాయ జానపద కళారూపాలతో సమృద్ధిగా ఉన్నదని చెప్పారు. చరిత్రలో గణనీయమైన కాలంపాటు శాస్త్రీయ నృత్యం, నాటకాలతో పాటు జానపద కళారూపాలు కూడా సాధారణ ప్రజలకు వినోదాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. జంగం కథ అనేక దేశీ మీటర్లను ఉపయోగించి ఆంధ్రాలో ప్రబలంగా ఉన్న తొలి జానపద గేయ రూపాలలో ఒకటిగా నిలిచిందన్నారు. చాలా మంది సాంప్రదాయ కళాకారులు, సంస్థలు ఇప్పుడు పురాతన సాంప్రదాయ జానపద సంగీతాన్ని గుర్తించడానికి, పునరుద్ధరించడానికి, పునఃస్థాపన చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని గోరటి వెంకన్న సంతోషం వ్యక్తం చేశారు.
మనిషి జీవితానికి, ప్రకృతికి మధ్య ఉన్న బొడ్డు సంబంధాన్ని, మనిషికి ఇతర జంతువులు-పక్షులకు మధ్య ఉన్న సంబంధాన్ని గోరటి వెంకన్న తన రచనల ద్వారా అందంగా ఆవిష్కరించారని డాక్టర్ సురేష్ కొనియాడారు. అంతకుముందు లయన్స్ క్లబ్కు చెందిన టి సత్యనారాయణ, వీ శ్రీనాథ్, బీ పృధ్వి, శ్రీహరి మూర్తి, తోట నాగరాజు తదితరులు గోరేటి వెంకన్నను ఘనంగా సన్మానించారు. తెలుగు సాహిత్యంలో తన రచనలతో ప్రసిద్ధి చెందిన గోరటి వెంకన్న.. కుబుసం చిత్రంలో ‘పల్లె కన్నీరు పెడుతుందో’ పాట తర్వాత పాపులర్ అయ్యారు. నవంబర్ 2020 లో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. 2021 లో ‘వల్లంకి తాళం’ రచనకు కవితల విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.