అమరావతి : రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధ్యాయ నియోజకవర్గాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ (Mlc Shaik Sabji) అంత్యక్రియలు ఏలూరులో అధికారిక లాంఛనాలతో ఆదివారం ముగిసాయి. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
శుక్రవారం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపి వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్సీ కారు డ్రైవర్, గన్మెన్, పీఏకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సాబ్జీ కుమార్తె ఆస్రిఫా అమెరికా నుంచి ఆదివారం ఉదయం ఏలూరుకు రావడంతో ఆయన అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు.
సాబ్జీ భౌతికకాయాన్ని ఆశ్రం ఆస్పత్రి నుంచి నేరుగా ఏలూరులోని యూటిఎఫ్ జిల్లా కార్యాలయానికి తరలించారు. అక్కడ కొద్దిసేపు ఉంచి, ప్రజల సందర్శనార్థం కలెక్టరేట్ ఏదురుగా ఉన్న ఇండోర్ స్టేడియానికి తీసుకెళ్లారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఎం నాయకులు, ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, కె.లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రమణ్యం, యూటిఎఫ్ రాష్ట్ర నాయకులు, సీఐటీయూ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాలకు చెందిన నాయకులు, జిల్లా ఉన్నతాధికారులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.