అమరావతి : వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్య చాలా దురదృష్టకరం. ఆ హత్యకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ విప్, మాచర్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇది వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యే తప్ప రాజకీయ కక్షలతో జరిగింది కాదని అన్నారు.15 సంవత్సరాల నుంచి మాచర్ల నియోజకవర్గంలో ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు కానీ,హత్యలుగానీ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం”అని ఆయన పేర్కొన్నారు.
చంద్రయ్య హత్యకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరుతున్నాం. ఈ హత్యలో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా పోలీసులు వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యుడిగా కోరుకుంటున్నాను. గడిచిన 15ఏళ్లుగా అదే కోణంలో ప్రజలకు ఒక జవాబుదారిగా పనిచేస్తున్నాను.
ఇవాళ జరిగిన ఆ సంఘటనను ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయాలని చూస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు ఈ ఘటనను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని, రాజకీయ కోణంలో చూపేందుకు యత్నిస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.