అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి నిర్వహించిన మంత్రివర్గ శాఖలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఇతర మంత్రులకు కేటాయించింది. తాజా కేటాయింపుల ప్రకారం.. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖలు, మంత్రి ఆదిమూలపు సురేష్కు లా అండ్ జస్టిస్, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్చ ఎన్ఆర్ఐ సాధికారత మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించారు.
పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి గత సోమవారం గుండెపోటుతో మరణించారు. దాంతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన చూసిన శాఖల వ్యవహారాలను కొత్తగా కేటాయించిన మంత్రులు చూసుకుంటారు. మార్చి 7న ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే గౌతమ్రెడ్డి చూసిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అసెంబ్లీలో ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు, చర్చలో పాల్గొనేందుకు మంత్రులకు వీలుంటుంది. మరోవైపు ఆత్మకూరు ఉప ఎన్నికకు ముందు గౌతమ్రెడ్డి కుటుంబసభ్యుల్లో ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.