RK Roja | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. జగన్పై దాడికి నిరసనగా ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు నిరసనలకు దిగారు. తిరుపతి జిల్లా నగరిలోని పుత్తూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రి ఆర్కే రోజా నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్పై దాడికి పాల్పడిన వారిపై వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దౌర్జన్యం నశించాలంటూ నినదించారు. సీఎం జగన్ చేస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే దాడి ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు.
జగన్ అనేవాడు ఉంటే తమకు డిపాజిట్లు సైతం రావని తెలిసే చంద్రబాబు నాయుడే దాడికి పాల్పడ్డారని.. జగన్పై హత్యాయత్నం చేయించారని రోజా ఆరోపించారు. చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని రోజా డిమాండ్ చేశారు. దాడి ఘటనను ఎన్నికల సంఘం సీనియర్గా తీసుకొని వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు. చంద్రబాబు ఎవరెవరితో ఈ తప్పు చేయించారో అందరిపైనా కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో తాము ఏం చేశామో ప్రజలకు చెప్పి అధికారంలోకి రావాలని.. దాడులతో అధికారంలోకి రావాలని చూడడం సరికాదన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ తమ ప్రసంగాల ద్వారా యువతను రెచ్చగొడుతున్నారని రోజా విమర్శించారు.
ఇదిలా ఉండగా.. విజయవాడలో జగన్పై జరిగిన దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్లోని వివేకానంద స్కూల్ దగ్గర దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే, స్కూల్ బిల్డింగ్పై నుంచే దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
ఆ ప్రాంతంలో అమర్చిన సీసీఫుటేజ్లను సైతం పరిశీలిస్తున్నారు. అదే సమయంలో వివేకానంద స్కూల్కు, గంగానమ్మ గుడికి మధ్య ఉన్న చెట్ల ప్రాంతం నుంచి దాక్కొని దాడి చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుడివైపు ఇండ్లు ఉండడంతో ఎడమవైపు ఉన్న స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతాన్ని ఎంచుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. రాత్రి సమయం కావడంతో నిందితుడు ఎవరికీ కనిపించలేదని.. కనీసం 30 అడుగుల దూరం నుంచి దాడి చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారని సమాచారం. ఇక వైద్యుల సూచన మేరకు జగన్ హాస్పిటల్లో చేరి చికిత్స చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.