మహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 20: మహబూబ్నగర్ పట్టణంలో చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులను మరింత వేగవంతం చేసి పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరిగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ నంద్లాల్ పవార్ వెల్లడించారు. కలెక్టర్ వెంకట్రావు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 5:30 గంటలకు మహబూబ్నగర్ పట్టణంలోని వన్టౌన్ చౌరస్తా నుంచి ఏనుగొండ వరకు వివిధ శాఖల అధికారులతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ రోడ్డు విస్తరణ, చౌరస్తాల పనుల్లో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి పనులు వేగవంతంగా నిర్వహించేందుకు ఆయా శాఖల సమన్యయంతో ముందుకు వెళ్లేందుకుగానూ మున్సిపల్, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, ఆరోగ్య తదితర శాఖల అధికారులతో కలిసి పట్టణంలో తిరిగి సమస్యలను పరిష్కరించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ఇదివరకే పట్టణంలో రహదారి విస్తరణ పనులు, జంక్షన్ అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని, మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ నేతృత్వంలో వారి ఆదేశాల ప్రకారం సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు అన్నిశాఖల అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పనులు ఇంకా వేగవంతంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. వన్టౌన్ జంక్షన్ పనులు వెంటనే చేట్టాలని అధికారులకు ఆదేశించారు. రోడ్డు విస్తరలో బ్రిడ్జిలు, విద్యుత్ స్తంభాల మార్పు, పద్మావతికాలనీ విద్యుత్ కార్యాలయం ఎదుట తక్షణమే డ్రైన్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ విజయభాస్కర్రెడ్డి, ఆర్డీవో పద్మశ్రీ, ఏసీపీ విద్యాసాగర్, ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, నేషనల్ హైవే డీఈ రమేశ్బాబు, పబ్లిక్ హెల్త్ డీఈ సంజీవరెడ్డి, అర్బన్ తాసిల్దార్ పార్ధసారథి, ట్రాఫిక్ ఎస్సై గోపాల్, అధికారులు ఉదయ్కుమార్, లక్ష్మీప్రియ, సయ్యద్ మొహియోద్దీన్, వైష్ణవి, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.