అమరావతి : నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసులో మంత్రి కాకాణి హస్తం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ వ్యూహ కమిటీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ముద్దాయిగా ఉన్న మంత్రి కాకాణిని కేసును తప్పించేందుకు కుట్ర జరుగుతుందని విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తులకే ఇటీవల క్యాబినెట్ పునర్వ్యివస్థీకరణలో మంత్రి పదవులు దక్కాయని పేర్కొన్నారు. మంత్రివర్గం కూర్పులో జగన్ ఏదో చేస్తాడని ఊహించామని కాని ఏమి చేయలేక పోయారని సొంత పార్టీ నాయకులే అంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
దీన్ని బట్టి చూస్తే జగన్ బలహీనత ఆర్థమవుతోందని అన్నారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి మూడేళ్లు దోచుకున్నారు. ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమేనా అని ప్రశ్నించారు. అపరిచితునిగా మారిన జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరుగుతుందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో ముందుకు సాగడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఒకటో తేదీనే పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చి మొదటి, రెండో వారంలో కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
టీడీసీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి కాకాణి 7 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని ఆరోపించారు. దేశ న్యాయ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా నెల్లూరు కోర్టులో పత్రాలు చోరీ ఘటన జరిగిందన్నారు. ఈ సంఘటనపై న్యాయమూర్తులు, న్యాయవాదుల స్వచ్ఛందంగా స్పందించి న్యాయవ్యవస్థను కాపాడాలని కోరారు. సీబీఐ చే విచారణ జరిపించాలని సూచించారు. ఈ ఘటనపై నెల్లూరు ఎస్పీ కట్టుకథ బాగా అల్లారని అన్నారు. శిక్ష నుంచి తప్పించేందుకు ఉద్దేశపూర్వక చోరీ జరిగిందని ఆరోపించారు.