అమరావతి : ఏపీలో పీఆర్సీ జీవోల అమలుపై చర్చించేందుకు ఇక తమ నుంచి ఎలాంటి ఎదురుచూపులు ఉండబోవని పీఆర్సీపై ప్రభుత్వం వేసిన సంప్రదింపు కమిటీ సభ్యులు, మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలే తమను పిలుస్తే చర్చలకు వెళ్తామని వెల్లడించారు. పీఆర్సీపై ఉద్యోగులతో చర్చించేందుకు నియమించిన సంప్రదింపుల కమిటీ సభ్యులు నాలుగురోజు శుక్రవారం సచివాలయంలో ఎదురుచూపులు చూశారు. పీఆర్సీ సాధన సమితి నాయకులు ఎవరూ రాకపోవడంతో వారు మీడియాతో మాట్లాడారు.
సీనియర్ మంత్రులు వచ్చి కూర్చున్నా, చర్చలకు రాకపోవడం,ఉద్యోగులతో మాట్లాడేందుకు నాలుగు మెట్లు దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ ఉద్యోగ సంఘాలు దానిని అలుసుగా తీసుకోవడం సరైన పద్దతి కాదని బొత్స అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, ఉద్యోగులతో ఘర్షణ వాతావరణాన్ని ప్రభుత్వం కోరుకోవడం లేదని అన్నారు.
చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. కొత్త పీఆర్సీ వల్ల జీతాలు తగ్గవని వెల్లడించారు. సమస్యను పరిష్కరించుకోవడానికి సహృద్భావ పరిస్థితులున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగులతో చర్చించేందుకు ప్రభుత్వ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని బొత్త వెల్లడించారు.