అమరావతి : దోషాల నివారణకు జ్యోతిష్యులు చెబుతున్న వింత ఆచారాలు ప్రజలను నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. తాజాగా ఏపీలోని కృష్ణా జిల్లాలో ఓ జ్యోతిష్యుడు మేకతో వివాహం జరిపించిన వైనం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని నూజివీడుకు చెందిన యువకుడికి అతడి కుటుంబ సభ్యులు వివాహ ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఓ జ్యోతిష్యుడిని సంప్రదించారు. యువకుడి జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకునే అవకాశముందని, ఈ దోషం నివారణకు మేకతో పెళ్లి జరిపించాలని సూచించాడు.
ఈ మేరకు యువకుడి కుటుంబ సభ్యులు నిన్న ఉగాది రోజున నూజివీడు పట్టణంలోని నవగ్రహ ఆలయంలో శాస్త్రోక్తంగా మేక మెడలో మూడుముళ్లు వేయించి మమ అనిపించారు. ఇక మొదటి వివాహం మేకతో జరిగింది కాబట్టి ఇక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు నూజివీడు యువకుడు. కంప్యూటర్ యుగంలో ఇంకా ఇలాంటి చోద్యాలు జరుగుతుండడం పట్ల స్థానికులు నివ్వెరపోతున్నారు.