AP News | కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. వైఎస్ షర్మిలతోపాటు తాను కాంగ్రెస్లో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. మంగళగిరిలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. తామందరం కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లమే అని.. తిరిగి అదే పార్టీలోకి వెళ్తున్నామని అన్నారు. తొందరలోనే షర్మిలమ్మ ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్గాంధీ, ఖర్గే ఇతర పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్లో చేరతారని చెప్పారు. ఆ తర్వాత తాను షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని స్పష్టం చేశారు. ఏపీ నుంచిక కాంగ్రెస్ పార్టీలో చేరబోయే మొదటి ఎమ్మెల్యే తానే అని తెలిపారు. ఇంకా ఎంతమంది కాంగ్రెస్లో చేరతారనే విషయం తనకు తెలియదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎటువంటి బాధ్యతలు అప్పగించినా కట్టుబడి ఉంటానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ విధివిధానాలకు అనుగుణంగా నడుచుకుంటానని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలుస్తాయని భావించడం లేదన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్కు వ్యతిరేకంగా న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తప్పెవరు చేసినా తప్పేనని పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండు మూడు రోజుల తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తానని పేర్కొన్నారు.