అన్ని దానాలలో కెల్లా రక్తదానం మిన్న అని పెద్దలు ఊరికే అనలేదు. ఎందుకంటే.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉన్నవాళ్లకు ఎవరైనా రక్తదానం చేస్తేనే ప్రాణాలు నిలబడతాయి. లేదంటే ప్రాణాలు పోవాల్సిందే. కేవలం రక్తం కోసం ఒక నిండుప్రాణాన్ని బలిగొనాల్సిందే. అందుకే.. అందరూ రక్తదానం చేయాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయినా కూడా కొందరు రక్తదానం చేయడానికి భయపడుతుంటారు.
కానీ.. ఓ వ్యక్తి మాత్రం తన జీవితంలో ఇప్పటి వరకు 100 సార్లు రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆయన వయసు 65 ఏళ్లు. అయినప్పటికీ ఇంకా రక్తం అవసరం ఉన్నవాళ్లకు దానం చేస్తున్నాడు. ఆయన పేరు పిల్ల వెంకటరమణ మూర్తి. ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన మూర్తి ప్రొఫెసర్గా పదవీ విరమణ చేశారు.
తన యుక్త వయసు నుంచే రక్తదానం చేయడం ప్రారంభించారు మూర్తి. తనకు 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు డిగ్రీ చదువుతున్న సమయంలో ఒకసారి ఆగ్రాకు ఎన్ఎస్ఎస్ క్యాంపుకు వెళ్లారు మూర్తి. అప్పుడే తొలిసారి ఆయన రక్తదానం చేసింది. రక్తదానం చేశాక.. ఆయనకు ఒకరకమైన ఆనందం కలిగిందట. అలాగే తన తండ్రి కూడా ఆయన విద్యార్థులకు రక్తదానం విశిష్టతను తెలియజేయడం చాలాసార్లు విన్నాడట. ప్రతి మనిషి తన జీవితంలో కనీసం 100 సార్లు అయినా రక్తదానం చేయొచ్చని చెప్పడం విని.. తను కూడా ఎలాగైనా 100 సార్లు రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నారట.
అలా.. ఇప్పటి వరకు యాక్సిడెంట్స్, క్యాన్సర్ ట్రీట్మెంట్, తలసీమియా పేషెంట్లకు 100 సార్లు రక్తదానం చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. యువతకు ఆదర్శంగా నిలిచారు.