శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దంపట్టే సంక్రాంతి కనుమ పండుగకు బసవన్నకు ప్రత్యేక పూజలు చేసి ఉత్సవంలో స్వామి అమ్మవార్ల నందివాహనసేవ, ఐదవరోజు కైలాస వాహన సేవలు జరిపించినట్లు ఈవో లవన్న చెప్పారు. అదేవిధంగా భారతీయ సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో ముగ్గుల ప్రాధాన్యతను వివరించారు. సంక్రాంతి పర్వదినాన ఆలయ దక్షిణమాడవీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ కర్యక్రమంలో స్థానిక మహిళలతోపాటు భక్తులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్బంగా చెంచుల ఆరాధ్య దైవమైన ఆదిదంపతులకు వైభవంగా బ్రహ్మోత్సవ కల్యాణం జరిపించారు. సోమవారం ఉదయం కనుమ పండుగ పురస్కరించుకుని శాస్త్రోక్తంగా గోపూజలు చేసినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు.
గిరిపుత్రుల ఆరాధ్య దైవమైన ఆదిదంపతులకు గిరిజన సాంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవ కల్యాణం ఘనంగా జరిపించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని సంక్రాంతి పండుగ రోజు రాత్రి నిత్యకల్యాణ మండపంలో వైభవంగా నిర్వహించారు. క్షేత్ర పరిసర ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాలకు సంభందించిన గిరిజన తండాల్లోని చెంచు భక్తులు కల్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నట్లు ఆలయ స్థానాచార్యులు తెలిపారు. చెంచు సాంప్రదాయం ప్రకారం స్వామి అమ్మవార్లకు వెదురుబియ్యం, పుట్టతేనె, ఆభరణాలు సమర్పించిన అడవి పుత్రులకు వేదాశీర్వచనాలు చేశారు. అదే విధంగా దేవస్థానం తరఫున మగవారికి పంచ కండువా, ఆడవారికి రవిక చీరెలను అందించినట్లు ఈవో లవన్న తెలిపారు.
మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు నంది వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులను అక్కమహాదేవి మండపంలో కైలాస వాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించిన అనంతరం డప్పు చప్పుళ్లు మేళతాళాలు కళాకారుల సాంప్రదాయ నృత్యాల నడుమ క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో ఏఈఓలు మోహన్, మల్లయ్య, మధుసూదన్ రెడ్డి, వెంకటేశ్వరావు, అయ్యన్న, సాములు, పీఆర్ఓ శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారి శ్రీనివాసరెడ్డి, సంపాదకుడు అనీల్కుమార్ పాల్గొన్నారు.
భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను జగద్గురు పీఠాధిపతులు దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రం ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగదేశి కేంద్ర శివాచార్య మహాస్వామి, కాశీ పీఠాధిపతి చంద్రశేఖర శివాచార్య మహాస్వామి, శ్రీశైల పీఠాధిపతి చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి, ఉత్తర కాశీ పీఠాధిపతి మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్య మహాస్వాములకు ఆలయ ప్రధాన గోపురం నుంచి పూర్ణకుంభ స్వాగతం పలుకుతూ ఈవో లవన్న ఆధ్వర్యంలో ఉభయ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ప్రాకారాలయంలో వేదపండితులు వేదగోష్టి నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను మైసూర్ అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామిలోపాటు అవదూత దత్త పీఠం ఉత్తరాధికారి శ్రీదత్త విజయానందతీర్థ స్వామివారు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన గోపురం వద్ద నుంచి ఏపీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఈవో లవన్న, వేదపండితులు పూర్ణకుంభ స్వాగతంతో ఆలయ ప్రవేశం చేయించారు. స్వామివారికి పంచామృతాభిషేకాలు, అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చనలు, వృద్ధమల్లికార్జునుడికి బిల్వార్చలు చేశారు. ప్రాకారంలోని పరివార దేవతాలయాలను దర్శించుకున్నారు. అమ్మవారి ప్రాకార మండపంలో వేదపండితులచే వేదగోష్టి చేసి పీఠాధిపతులకు తీర్థప్రసాదాలు ఇచ్చారు.