తిరుపతి: విశాఖపట్నంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఓకే అయ్యాయి. ఈ నెల 18 నుంచి 23 వరకు మహా సంప్రోక్షణ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చివరిరోజు 23వ తేదీన ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ జరుపుతారు.
మార్చి 18వ తేదీన శుక్రవారం రాత్రి 7 నుంచి 10 గంటల వరకు ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. 19న శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యగాశాలవాస్తు, పంచగవ్య్రపాశనం, రక్షాబంధనం, అకల్మషహోమం, అక్షిమోచనం, బింబశుద్ధి, పంచగవ్యాధివాసం చేపడతారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు అగ్నిప్రతిష్ట, కలశస్థాపన, కుంభావాహనం, కుంభారాధన, హోమం నిర్వహిస్తారు. మార్చి 20న ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు హోమం, యాగశాల కార్యక్రమాలు చేపడతారు.
మార్చి 21న సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హోమం, జలాధివాసం, యాగశాల కార్యక్రమాలు, రత్నన్యాసం, విమాన కలశస్థాపన, బింబస్థాపన, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు హోమం, యాగశాల కార్యక్రమాలు జరుగుతాయి. 22 న మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బింబవాస్తు, నవకలశ స్నపనం, చతుర్దశ కలశ స్నపనం, యాగశాల కార్యక్రమాలు, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు మహాశాంతి తిరుమంజనం, రాత్రి 8 నుంచి 10.30 గంటల వరకు రక్షాబంధనం, కుంభారాధనం, నివేదన, శయనాధివాసం, హౌత్రం, సర్వదేవతార్చన, హోమం, యాగశాల కార్యక్రమాలు ఉంటాయి.
చివరి రోజైన 23 బుధవారం నాడు ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు కుంభాలను, ప్రధాన దేవతా విగ్రహాలను ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొస్తారు. అనంతరం 10.20 గంటల మధ్య వృషభ లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తరువాత ధ్వజారోహణం, అర్చక బహుమానం అందిస్తారు. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 3 నుంచి 4.15 గంటల వరకు కల్యాణోత్సవం జరుగనున్నది. అనంతరం ధ్వజావరోహణం చేపడతారు. తిరిగి రాత్రి 7.30 నుంచి 8.45 గంటల వరకు సర్వదర్శనం కల్పిస్తారు.