Maha Shivaratri | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ చెప్పారు. ఇందుకోసం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని విజయవంతంగా నిర్వహించాలన్నారు.
మంగళవారం జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్నతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రెవిన్యూ, ఆరోగ్య, మత్స్య, పోలీస్ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైల క్షేత్ర పరిధిలో జరుగుతున్న ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. కర్నూలు, ప్రకాశం, నాగర్కర్నూలు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇతర అధికారులతో కలిసి శ్రీశైల మహా క్షేత్ర పరిధిలోని వివిధ ప్రధాన కూడళ్లు, ఆలయ పరిసరాలలో పర్యటించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు పలు కీలక వసతులు కల్పించాలని నిర్ణయించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర, దక్షిణాది ప్రాంతాల నుండి బ్రహ్మోత్సవాలకు ఎనిమిది లక్షల మందికి పైగా యాత్రికులు స్వామిఅమ్మవార్లను దర్శించుకోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నదాన శిబిరాల నిర్వహణ, ట్రాఫిక్ సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు.
రద్దీ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, పారిశుద్య నిర్వహణ, తాత్కాలిక 30 పడకల ఆసుపత్రులు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ భక్తులకు అందుబాటులో ఉండాలని మనజీర్ జిలానీ సామూన్ సూచించారు. పాతాళగంగ, లింగాలఘాట్ స్నానాల గట్ల వద్ద 240 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి మోలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. మంచినీటి సరఫరా, శానిటేషన్ విభాగాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
శ్రీశైల మహా క్షేత్రాన్ని ప్రధానంగా 10 జోన్లు, 40 సెక్టార్లుగా విభజించి జిల్లా స్థాయి అధికారులను ఇంచార్జులుగా నియమించారు. ఆధునిక సాంకేతికత సాయంతో 400 నిఘానేత్రాలతో ప్రధాన కూడళ్లలో కదలికల పరిశీలనకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఆయా ప్రాంతాల్లో యాత్రికుల కదలికలు, వసతుల కల్పన తీరును స్వయంగా పర్యవేక్షిస్తామని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. గత ఏడాది భక్తులకు కలిగిన అసౌకర్యాలను దృషిలో ఉంచుకుని పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేక రూట్మ్యాప్ తయారు చేశామన్నారు. సుమారు 3000 వాహనాలు ఒకేసారి పార్కింగ్ చేసుకునే సౌకర్యం కలిగించినట్లు ఈవో లవన్న అధికారులకు వివరించారు.
బ్రహ్మోత్సవాల సందర్బంగా ఉభయ ప్రధానాలయాలో జరిగే నిత్యకైంకర్యాలు, మహాశివరాత్రి పర్వదిన ప్రత్యేక కార్యక్రమాలు, పాగాలంకరణ, లింగోద్బవకాల పూజలు, అర్ధరాత్రి కళ్యాణోత్సవం మరుసటిరోజు రథోత్సవం, తెప్పోత్సవంతోపాటు 30 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్దం చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు వివరించారు. క్షేత్ర పరిధిలో మోబైల్ నెట్వర్క్ల సిగ్నల్స్ పెంచేందుకు మైక్రోటవర్స్ ఏర్పాటు చేసుకోవాలని ఎయిర్టెల్, జియో, ఐడియా, సంస్థలతోపాటు బీఎస్ఎన్ఎల్ టెలికాం విభాగం వారికి సూచించినట్లు తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చే యాత్రికుల కోసం వివిధ ప్రాంతాల నుండి సుమారు 850 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. వాటిని షఫిల్ సిస్టమ్లో తిప్పేందుకు సన్నాహాలు చేశామని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక పార్కింగ్, బస్టాండ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా లింగోద్బవ సమయం తరువాత పాగాలంకరణ దర్శనాలు చేసుకుని తిరుగు ప్రయాణమయ్యే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫిట్నెస్ సరిగాలేని వాహనాలతో వచ్చి ఘాట్ రోడ్డులో సమస్యలను సృష్టించవద్దని ఏస్పీ కోరారు.
బ్రహ్మోత్సవాలలో వివిధ ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు వ్యవహరించాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు. యాత్రికులకు అవసరమైన వస్తువులు, సామాగ్రి అధిక ధరలకు విక్రయాలు జరపడం చట్టరీత్యా నేరమన్నారు. అందుకు సంబంధిత శాఖలైన లేబర్ కమీషనర్, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కల్తీ లేని ఆహారం భక్తులకు అందేలా చర్యలు తీసుకుంటారని వివరించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
శ్రీశైల దేవస్ధానం పరిధిలో వాల్మికి నిత్యాన్నదాన సత్రం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి వనపర్తి వాసి పిక్కిలి మణ్యం ఙ్ఞాపకార్థం ఆయన సతీమణి వెంకటమ్మ, కుమారుడు రాము రూ.10,116 చెక్ విరాళంగా ఇచ్చారు. అలాగే కృష్ణా జిల్లా వాసి అహల్యారాణి మంగళవారం దేవస్థానం అన్నదాన కార్యక్రమానికి రూ. లక్షచెక్ను దేవస్థానం పర్యవేక్షకులు రవికుమార్కు అందచేశారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రాన్ని అందజేశారు.