అమరావతి : శ్రీశైలం దేవస్థానంలో ఫిబ్రవరి 11 నుంచి 21 వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న తెలిపారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కృష్ణ దేవరాయగోపురం, నాగులకట్ట, అమ్మవారి ఆలయం , కల్యాణ మండపం, శ్రీస్వామివారి నిత్య కల్యాణ మండప ప్రాంగణాన్ని పరిశీలించారు.
ఉత్సవ రోజుల్లో స్వామివారి ఆలయ ముఖ మండపంలో భక్తుల కోసం మరొక క్యూలైన్ ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం క్యూలైన్లకుంటే కొంచెం ఎత్తులో మరో క్యూలైన్ ఏర్పాటు చేసే భక్తులు ఎక్కువ సమయం వేచియుండ కుండా స్వామివారిని సులువుగా దర్శించుకుంటారని ఆయన వెల్లడించారు. వీవీఐపీలకు, వీఐపీలకు వేర్వేరూగా గ్యాలరీలను ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. మహాశివరాత్రి రోజున కల్యాణ కట్ట వద్ద శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.