Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అశ్వ వాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయంకాలం వేద మంత్రోఛ్చారణల మధ్య మంగళ వాయిద్యాలతో అక్కమహాదేవి మండపంలో శాస్త్రోక్తంగా పూజలు జరిపించి ఆలయోత్సవం నిర్వహించినట్లు ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు.
దివ్యకాంతులను ప్రసరింప జేస్తూ భక్తులకు వరాలిచ్చే స్వామి అమ్మవార్ల అశ్వ వాహనసేవను వీక్షించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చారు.
అమ్మవారికి ప్రీతికరమైన కాగడాలు, ఎర్రగులాబీలు, తెల్లచామంతి, ఊదాచామంతి, మందారం, లిల్లీ, ఎర్ర గన్నేరు, ఊద గన్నేరు, దేవ గన్నేరు, నంది వర్దనం, గరుడ వర్దనం, తెల్ల చామంతి తదితర 21 రకాల ప్రత్యేక పుష్పాలను స్వామి అమ్మవార్లకు సమర్పించారు.
వీటితోపాటు జామ, ఖర్జూర, నల్లద్రాక్ష వంటి 9 రకాల పండ్లతోపాటు బిల్వం మరువం మాచీపత్రితో ప్రత్యేక అలంకరణ చేసిన శయనమందిరంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ఏకాంతసేవగా శయనోత్సవాన్ని నిర్వహించినట్లు ఈవో తెలిపారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన కళాకారులతోపాటు ఆలయ అధికారులను సిబ్బందిని ఈఓ డీ పెద్ది రాజు అభినందించారు.