శ్రీశైలం : ప్రపంచ ప్రజానీకాన్ని వణికిస్తూ ప్రజల అకాల మరణాలకు కారణమైన కరోనా మహమ్మారి శాశ్వత నివారణ కాంక్షిస్తూ శ్రీశైలంలో చేపట్టిన మహా మృత్యుంజయ పాశుపత హోమం ముగిసినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 41 రోజుల పాటు అర్చక వేదపండితులచే ఏకాంతంగా మృత్యుంజయ మంత్ర పున:శ్చరణ, హోమాలు, జపానుష్టాన శాస్త్రిక పూజలు చేస్తూ కరోనా కట్టడికి స్వామి అమ్మవార్ల అనుగ్రహం కలగడం శుభసూచకమన్నారు. మహిమాన్విత శ్రీశైల క్షేత్రంలో ఈ పాశుపత హోమం చేయడం ఏంతో ఫలదాయకమని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు వివరించారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీశైల టీవీ యుట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించిన భక్తులకు ఆది దంపతులైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల దర్శన భాగ్యం కల్పించామని శ్రీశైల ప్రభ సంపాదకుడు అనీల్ కుమార్ తెలిపారు.