గుంటూరు: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దుర్గి మండలం అడిగొప్పల వద్ద మంగవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సాగర్ కుడికాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరొకరు గాయాలతో బయటపడ్డారు.
కాలువలో కారు పడిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీశారు. గాయపడిన అతడిని దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన కారు మాచర్ల ఎమ్మెల్యే పినెల్లి రామకృష్ణా రెడ్డి సోదరుడు మదన్ మోహన్ రెడ్డిదిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మదన్మోహన్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడగా, ఆయన భార్య, చిన్నారి మృతిచెందిందని తెలిపారు.
భారీ క్రేను సహాయంతో ప్రమాదానికి గురైన కారును కాలువలో నుంచి వెలికి తీశారు. అందులో ఉన్న ఇద్దరి మృతదేహాను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.