పలనాడు జిల్లా: హైదరాబాద్ వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఒకటి బోల్తా కొట్టింది. ట్యాంకర్లోని నూనె అంతా నేలపాలయ్యింది. విషయం తెలుసుకున్న స్థానికులు చెంబు, డబ్బాల్లో అందినకాడికి నింపుకుని జారుకున్నారు. ఈ ఘటన నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద నార్కట్ పల్లి – అద్దంకి హైవేపై జరిగింది.
చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ నార్కట్పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై చల్లగుండ్ల వద్ద అదుపు తప్పింది. ట్యాంకర్ను కంట్రోల్ చేయడంలో డ్రైవర్ విఫలమవడంతో హైవేపై బోల్తా పడింది. దాంతో ట్యాంకర్లోని ఆయిల్ అంతా రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో డబ్బాలు, బాక్సులు, చెంబులతో పరిగెత్తుకు వచ్చి అందినకాడికి ఎత్తుకున్నారు.
నకరికల్లు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినా ప్రజలు పట్టించుకోక పోవడంతో పోలీసులు పక్కకు తప్పుకున్నారు. ఫలితంగా హైవేపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చివరకు భారీ క్రేన్ సాయంతో ట్యాంకర్ను అక్కడి నుంచి తరలించారు.