రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద మొత్తంలో మద్యంను పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. పక్కా సమాచారంతో రావులపాలెం పోలీసులు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ బృందం రావులపాడులో అక్రమ మద్యం నిల్యల స్థావరంపై దాడులు నిర్వహించి.. భారీగా మద్యాన్ని పట్టుకున్నారు. దాదాపు రూ.10 లక్షల విలువైన మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
రావులపాలెంకు చెందిన కూసుమంచి వెంకటరత్న త్రినాథ్ అనే వ్యక్తి.. గత కొంత కాలంగా గోవా నుంచి అక్రమ మార్గంలో మద్యం దిగుమతి చేసుకుంటున్నాడు. దీనిని స్థానికంగా కర్రి సుబ్బారెడ్డి, లావేటి శ్రీనివాసరావు, మరికొందరితో కలిసి ఎక్కువ మొత్తానికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గోవా నుంచి అక్రమంగా తీసుకువస్తున్న మద్యాన్ని గోదాంలో నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందడంతో రావులపాలెం పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రధాన నిందితుడు వెంకటరత్న త్రినాథ్తో పాటు లావేటి శ్రీనివాసరావు, అటపాకల శ్రీనువాసును అరెస్ట్ చేశారు.
ఈ అక్రమ మద్యం విక్రయాల కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి 9,200 క్వార్టర్ బాటిళ్లను సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కేసులో సమయస్ఫూర్తితో వ్యవహరించి భారీ మొత్తంలో అక్రమ గోవా మద్యం పట్టుకోవడానికి కృషి చేసిన సిబ్బందిని ఎం రవీంద్రనాథ్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.