అమరావతి : ఏపీలో పీఆర్సీ, ఉద్యోగుల సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి ఇచ్చిన అధికారుల నివేదిక ఆమోదంగా లేదని,ఇక ఫిట్మెంట్పై సీఎం దగ్గరే తేల్చుకుంటామని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వెల్లడించారు. గురువారం అమరావతిలోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ధర్నాలో జేఏసీ నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. మంత్రుల సమక్షంలో నిన్న కొనసాగిన చర్చలు అసంతృప్తిగానే ముగిసాయని తమ డిమాండ్లన్నింటిపై ప్రభుత్వం స్పందిస్తేనే తదుపరి కార్యాచరణపై చర్చిస్తామని పేర్కొన్నారు.
అధికారుల కమిటీ ఇష్టమున్నట్లుగా నివేదిక ఇచ్చారని, 14.39 శాతం ఫిట్మెంట్ తమకు కుదరదని చెప్పాం. 50శాతం ఫిట్మెంట్ను ఇవ్వాల్సిందేనని వెల్లడించారు. ఉద్యోగుల కనీస వేతనం రూ.23వేలు ఉండాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మూల వేతనం పెంచాలని, గ్రాట్యుటీని రూ.23లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదిక పాక్షికంగా ఇచ్చారని, మిగిలిన నివేదికలు కూడా ఇవ్వాలని కోరారు . కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని.. వారికి హెచ్ఆర్ఏ, డీఏ ఇవ్వాలన్నారు.