అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకినాడ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ హత్యకేసుపై జిల్లా ఎస్పీ బాధితులకు భరోసా కల్పించారు. వైసీపీ ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకుంటామని నిర్దిష్ట హామీ ఇవ్వడంతో మృతుడి కుటుంబ సభ్యులు పోస్టుమార్టంకు ఒప్పుకున్నారు. దీంతో నిన్న రాత్రి వైద్యులు మృతుడు సుబ్రహ్మణ్యంకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. గత రెండు రోజులుగా మృతదేహం ఉంచిన ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు, పలు పార్టీలకు చెందిన నాయకులు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్సీని అరెస్టు చేసేంతవరకు పోస్టుమార్టంకు అంగీకరించబోమని పేర్కొనగా కాకినాడ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు నిన్న రాత్రి కలెక్టర్, ఎస్పీలు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనుమానాస్పద కేసు కాకుండా హత్య కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు శాంతించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం పెదపూడి మండలం జి.మామిడాడకు తరలించారు.