తిరుమల : తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడి (Leopard Attack) లో మరణించిన ఆరేండ్ల చిన్నారి లక్షిత( Lakshitha) మృతదేహానికి పోస్టుమార్టం(Postmortem) పూర్తి చేశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. చిన్నారిని చంపింది చిరుతేనని వైద్యులు (Doctors) నిర్ధారించారు.
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పొతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన దినేష్, శశికళ కుటుంబం కూతురు లక్షిత, కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో అలిపిరి నుంచి కాలినడకన తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటలకు వారంతా లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడ మాటు వేసి చిరుత ఒక్కసారిగా దాడి చేసింది, కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో పాపను అడవిలోకి లాక్కెళ్లింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే రాత్రి సమయం కావడంతో గాలింపు వీలుపడలేదు.
ఉదయం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు లక్ష్మీనరసింహ స్వామి (Laxmi Narasimha Swamy Temple) ఆలయానికి కొద్ది దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పాపను సగానికి తిని వదిలివెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. జూన్ నెల మూడవ వారంలో మెట్ల మార్గంలో ఓ బాలుడిపై చిరుత దాడి చేయగా అక్కడే ఉన్న బాలుడి తండ్రి, అటవి సిబ్బంది కేకలు వేస్తూ వెంబడించగా బాలుడిని వదిలేసి పారిపోయింది . దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు కౌశిక్ తిరుపతిలోని టీటీడీకి చెందిన ఆసుపత్రిలో చేర్పించి దాదాపు 20 రోజుల పాటు చికిత్స అందించి ఆరోగ్యం మెరుగైన తరువాత ఇంటికి పంపించారు.