అమరావతి : హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిసాయి. పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా ఎగువరేగడ పల్లెకు తరలించారు. వలసపల్లి నుంచి ఎగువ రేగడ పల్లె వరకూ 30కిలోమీటర్ల వరకు అంతిమ యాత్ర కొనసాగింది. యువకులు దారిపోడవునా జాతీయజెండాలను చేతబట్టి సాయితేజ అమర్రహే అంటూ నినాదాలు చేశారు.
పార్థివదేహం తరలిస్తున్న వాహనంపై పూలవర్షం కురిపించి ఘనంగా నివాళి అర్పించారు.కడసారిగా ఆయన పార్ధివదేహాన్ని చూసేందుకు గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయితేజ ఇంటి వద్దకు పార్థివదేహాన్నితీసుకురాగా అతడి కుటుంబ సభ్యులు పార్థివదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యరు. ఒక్కసారిగా వారి రోధనలు మిన్నంటాయి. అక్కడి నుంచి మైదానంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.