Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 26న శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరుగనున్నది. సాత్విక బలిగా గుమ్మడి కాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నరాశి సమర్పించేందుకు ఈ వార్షిక కుంభోత్సవం నిర్వహిస్తారు. ఈ కుంభోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం స్థానిక రెవెన్యూ, పోలీసు, దేవస్థానంలోని వివిధ విభాగాల అధిపతులు, పర్యవేక్షకులు, దేవస్థాన వైదిక సిబ్బంది తదితరులతో ఈఓ డీ పెద్దిరాజు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ సీ గుర్రప్ప, డిప్యూటీ తహశీల్దార్ ఎం కిశోర్ కుమార్, స్థానిక సీఐ ప్రసాదరావు, ఎస్ఐ జీ లక్ష్మణ రావు, మాణికేశ్వరి మాత ఆశ్రమ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు మాట్లాడుతూ ముఖ్యంగా ‘క్షేత్ర రక్షణ’ కోసం నిర్వహించే ఉత్సవంగా కుంభోత్సవం పేరొందిందన్నారు. కనుక అమ్మవారికి ఉత్సవ సంబంధ కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరిపించాలని వైదిక సిబ్బందికి సూచించారు. దేవాదాయ చట్టం ప్రకారం క్షేత్ర పరిధిలో జంతు, పక్షి బలులు, జీవ హింసను పూర్తిగా నిషేధించామని చెప్పారు. అందుకే జంతు బలుల నిషేధం అమలుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, నిషేధం అమలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
క్షేత్ర పరిధిలో జంతు, పక్షి బలి నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఈఓ డీ పెద్ది రాజు కోరారు. ఈ విషయమై స్థానిక రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పూర్తిగా సహకరించాలని కోరారు. జంతు బలి నిషేధం అమలు చేయడానికి పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీ బృందాలు (మొబైల్ స్క్వాడ్) ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవ సమయంలో జంతుబలుల నిషేధానికి ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని స్థానిక పోలీసు అధికారులను కోరారు. గస్తీ నిర్వహణ కోసం దేవస్థానం అధికారులు, సిబ్బందికి కూడా ప్రత్యేక విధులు కేటాయించాలని దేవస్థానం పరిపాలనా విభాగాన్ని ఆదేశించారు.
ఆలయ మాడ వీధులు, ప్రధాన ద్వారాలు, అంకాళమ్మ ఆలయం, పంచ మఠాల దగ్గర గల మహిషాసుర మర్దిని, రుదరాక్ష మఠం వద్ద ఛిన్నమస్తాదేవి, పాత వర్క్ షాప్ వద్ద సుంకులమ్మ, పాతాళ గంగ మార్గ సమీపంలో వజ్రాల గంగమ్మ, టోల్ గేట్ తదితర చోట్ల సిబ్బంది ప్రత్యేక విధులు నిర్వర్తించాలని ఈఓ డీ పెద్ది రాజు చెప్పారు. కుంభోత్సవం రోజుల్లో బస్సుల్లో జంతువులు, పక్షులను రవాణా చేసేందుకు అనుమతించవద్దని, ఇందుకోసం తగు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కోరతామని ఈఓ పెద్ది రాజు చెప్పారు.
జంతు బలి నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి దేవస్థానం టోల్ గేట్ వద్ద ప్రత్యేక తనిఖీ ఏర్పాటు చేయాలని స్థానిక రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులకు సూచించారు. ఈ తనిఖీలకు దేవస్థానం కూడా తగినంత మంది సిబ్బందిని నియమించి సహకరిస్తుందన్నారు. జంతు బలి నిషేధంపై భక్తుల్లో అవగాహన కల్పించడానికి టెంపుల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఆలయ, ప్రచార విభాగాలను ఈఓ డీ పెద్దిరాజు ఆదేశించారు. శ్రీశైల క్షేత్ర పరిధిలో జంతుబలి నిషేధంపై పూర్తి అవగాహన కల్పించడానికి విస్తృతంగా బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్, ప్రచురణల విభాగం అధికారులను ఆదేశించారు.
కుంభోత్సవం సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో కుంభోత్సవానికి ముందు, తర్వాత రోజుల్లో మద్యం అమ్మకాలను నిలిపివేసేందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరాలని ఈ సమన్వయ సమావేశంలో నిర్ణయించారు. కుంభోత్సవం రోజు సాయంత్రం అమ్మవారి దర్శనాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఈఓ పెద్ది రాజు చెప్పారు. ఈ సమయంలో భక్తుల క్యూ లైన్లలో తొక్కిసలాట లేకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని దేవస్థాన భద్రతా విభాగపు పర్యవేక్షకులను ఆదేశించారు.