హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల రూ. 4వేల కోట్ల ఫీజు బకాయిలు 48 గంటలోపు చెల్లించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్కృష్ణయ్య (R Krishnaiah) హెచ్చరించారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ప్రైవేట్ కాలేజీల నిరవధిక బందుకు ఆర్ కృష్ణయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజుల బకాయిల వల్ల వందల సంఖ్యలో డిగ్రీ కళాశాలలు( Degree colleges) మూతపడడం, ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యలో తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నెలలకు జీతాలు తీసుకోవడం లేదా? విద్యార్థుల చదువులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎందుకు లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 22న విద్యార్థి సంఘాలు ఇచ్చిన కలెక్టరేట్ల ముట్టడి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఫీజు బకాయిలు ఇచ్చే వరకు బందులు, నిరసనలు, ధర్నాలు కొనసాగుతాయని వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth ) భేషాజాలకు పోకుండా ఫీజు బకాయిలు విడుదల చేయాలన్నారు.
ఎన్నికల సమయంలో రాహుల్గాంధీ విద్యార్థులకు అన్ని విధాలు చేయూతనిస్తామని ఊతదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని గుర్తు చేశారు. రేవంత్రెడ్డి ఆరు బూటకపు హామీలు (Six Guarantees) ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను, విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. పరిపాలన చేతకాకుంటే మరొకరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.