Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో బుధవారం ఆణివార ఆస్థానం జరుగనున్నది. ఈ క్రమంలో మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సీహెచ్ వెంకటయ్య చౌదరిలతో కలిసి ఈవో జే శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడిగినట్లు వివరించారు.
స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భాను ప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతా రామ్, సదా శివరావు, జంగా కృష్ణ మూర్తి, జానకి దేవి, మహేందర్ రెడ్డి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.