అమరావతి : ఏపీలోని గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani ) మరోసారి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. పొత్తుల పేరిట ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తుల కోసం మూడురోజుల పాటు ఢిల్లీలో పడిగాపులు కాశారని ఆరోపించారు.
మతతత్వ పార్టీ బీజేపీ అంటూ విమర్శించిన చంద్రబాబు(Chandra Babu) 2014లో మరోసారి బీజేపీ మిలాఖతై పోటీ చేసి 2019లో మోదీపై ఆరోపణలు చేస్తూ దూరమయ్యారని అన్నారు. ఏపీ భవిష్యత్ అంటూ నాటకం ఆడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలతో సిగ్గు లేకుండా పొత్తులు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్లో ఉన్న వైఎస్ షర్మిల(YS Sharmila) పరోక్షంగా చంద్రబాబు గెలుపునకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
మణిపూర్ ఊచకోతకు ఏపీలో ఉన్న సీఎం జగన్కు ఏం సంబంధం ? తెలంగాణలో తిరిగినప్పుడు షర్మిలకు మణిపూర్ గుర్తుకురాలేదా? పాస్టర్ అని చెప్పుకునే బ్రదర్ అనీల్ మణిపూర్ వెళ్లాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. జనసేన అధ్యక్షుడు పవన్ 21 సీట్లకు దిగజారాడని, పార్టీని పెట్టింది దేనికి అడుక్కోవడానికా అంటూ మండిపడ్డారు. పవన్ను నమ్ముకున్నవాళ్లందరికీ నట్టేట ముంచాడని ఆరోపించారు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్న ఏపీలో వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ధీమాను వ్యక్తం చేశారు.