Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, యాత్రికులతో రెండవ సోమవారం తెల్లవారుజాము నుంచే క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి. పాతాళగంగలో పుణ్య స్నానాలు చేసుకున్న భక్తులు.. కృష్ణమ్మకు దీప దానాలు, చీరసారెలు సమర్పించుకున్నారు.
కార్తీక పౌర్ణమి నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల్లో అలంకార దర్శనాలు మాత్రమే కల్పించారు. అయినా, స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకోవడానికి మూడు గంటలకుపైగా పట్టింది.
క్షేత్రపరిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో యాత్రుకులు కూడా సహకరించాలని ఈవో లవన్న కోరారు. పౌర్ణమి సందర్బంగా వచ్చిన యాత్రికులు ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించి స్వామివార్లను దర్శించుకోవడానికి క్యూలైన్లలో బారులు దీరారు.
కార్తీక పౌర్ణమి సందర్బంగా భ్రమరాంబదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ఊయలసేవ, పల్లకిసేవ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ఊయలలో వేంచేబుచేసి మహా సంకల్పం, ఖడ్గమాల, అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చన చేశారు.
కార్తీక పౌర్ణమి సందర్బంగా పాతాళగంగ వద్ద నెలకోల్పిన కృష్ణవేణి నదీమతల్లి విగ్రహానికి ఈవో లవన్న దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత సంప్రదాయబద్ధంగా కృష్టమ్మకు పసుపు కుంకుమ గాజులతో చీరసారెలను సమర్పించి గంగా హారతులు ఇచ్చారు.
అర్చక వేదపండితుల మంత్రోచ్చారణతో ఏక హారతి, నేత్ర హారతి, బిల్వహారతి, నాగహారతి, పంచహారతి, పుష్పహారతి, నందిహారతి, సింహహారతి, నక్షత్రహారతి, విష్ణుహారతి, కుంభహారతులతో ఏకాదశ గంగాహరతులను నివేదించారు.
పౌర్ణమి ప్రదోషకాలంలో ఆలయ ప్రధాన వీధిలో గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం నిర్వహించారు. సంప్రదాయంగా దాతలు అందించిన నూలు వత్తులను ఆవునెయ్యితో తడిపి ఎత్తైన స్తంభాలపై వేలాడించి దీప ప్రజ్వలన చేశారు.
త్రిపురాసురుణ్ని సంహరించాక పరమేశ్వరునికి దృష్టి దోష పరిహారం కోసం, విజేయుడైన శుభవేళలో పార్వతీ దేవి తొలుతగా జ్వాలాతోరణం జరిపించినట్లు పురాణ ఇతిహాసాల ప్రవచనాలను భక్తులు ఆద్యంతం వింటూ దీప కాంతులను దర్శించుకున్నారు.
కార్యక్రమంలో ఈవో లవన్నతోపాటు స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కార్తీక మాసంలో రెండవ సోమవారం సందర్బంగా ఆలయ పుష్కరిణి వద్ద స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దశవిధ హారతులు ఇచ్చారు. తర్వాత లక్షదీపోత్సవం జరిపించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికుల ప్రతి ఒక్కరూ కార్తీక దీపాలను వెలిగంచుకునే అవకాశాన్ని కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా సెల్వమణి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
సోమవారం ఉదయం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి ఈవో లవన్న పూలమాలు వేసి అర్చక వేద పండితులచే తిలకధారతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు.
అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రం, ఙ్ఞాపికను అందజేశారు. ఈకార్యక్రమంలో ఏఈవో మోహన్, శ్రీశైలం సిఐ దివాకర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఒకే చోట వెలసిన ఏకైక క్షేత్రం శ్రీశైలంలో కార్తీక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక సోమవారం, పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనానంతరం ఆలయ ఉత్తర మాఢవీధిలో ఏర్పాటు చేసిన ఉసిరిక చెట్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
ఏపీ మంత్రి రోజా సెల్వమణి, అచ్చంపేట ఎమ్ఎల్ఏ గువ్వల బాలరాజు సతీమణి గువ్వల అమల దీపాలను వెలిగించారు. అంతకు ముందు ఉసిరిక చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దీపదానాలు చేశారు.