Srisailam | కార్తీక సోమవారం సందర్భంగా శ్రీశైలంలో పరమశివుడికి శాస్త్రోక్తంగా పూజలు ఘనంగా నిర్వహించామని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. తొలి సోమవారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. సాయంత్రం పుష్కరిణి వద్ద లక్ష దీపార్చన, పుష్కరిణికి దశవిధ హారతులు జరిపించారు. ఈ కార్యక్రమానికి ఏటా వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారని శ్రీశైల దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు మఠం విరూపాక్షయ్య చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వీరన్న, మార్కండేయశర్మ అధికారులు సిబ్బందితోపాటు పీఆర్ఓ శ్రీనివాసరావు, శ్రీశైలప్రభ సంపాదకుడు అనీల్కుమార్, ఏఆవోలు మోహన్, హరిదాస్, మల్లయ్య, డీఈ నర్సింహరెడ్డి, ఆలయ భద్రతాధికారి నర్సింహరెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న, రవి తదితరులు పాల్గొన్నారు.
సాయంకాల వేళ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయోత్సవంగా తోడ్కొని వచ్చి, పుష్కరిణి వద్ద ప్రత్యేక పుష్పాలంకరణతో అలకరించిన వేదికపై వేంచెంబు చేశారు. శాస్త్రోక్తంగా పూజలు చేశామని ఈవో లవన్న తెలిపారు. కార్తీక మాసంలో దశ విధ హారతుల ధర్శనంతో సకల సౌభ్యాగ్యం కలుగుతుందని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నది. కార్తీక మాసం తొలి సోమవారం పరమ శివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర, దక్షిణ రాష్ట్రాల నుంచి భక్తులు, యాత్రికులు వచ్చారు. భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు.
తెల్లవారుజుమున కృష్ణా నదిలో పుణ్య స్నానాలు చేసుకుని పసుపు కుంకుమలతో కృష్ణమ్మకు కుంకుమ సారె సమర్పించి, కార్తీక దీప దానాలు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు.
స్వామివారికి సామూహిక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు, చండీహోమం, రుద్రయాగం, నిత్యకళ్యాణం, వృద్దమల్లికార్జున స్వామివారికి జరిగిన బిల్వార్చనలలో భక్తులు పాల్గొన్నారు.
కార్తీక మాసం ప్రత్యేకంగా వీరశిరోమండపంలో ఓం నమ: శివాయ ప్రణవ పంచాక్షరీ మంత్రాన్ని కర్ణాటక ఆంధ్ర భజన బృందాల ఆధ్వర్యంలో చతుస్సప్తాహ భజనలు నిరంతరం జరుగుతున్నాయి. ఆలయ ఉత్తర మాఢవీధితోపాటు గంగాధర మండపం, ఉత్తర మాడవీధిలో మహిళలు అధిక సంఖ్యలో కార్తీక దీపాలను వెలిగించారు.
ఆలయ దర్శనాలు ప్రారంభమై ముగిసే వరకు ఉచిత ప్రసాద వితరణ, క్యూలైన్లలో దర్శనానికి వేచి ఉండే భక్తులకు పాలు, మంచినీరు, బిస్కెట్లు, అల్పాహర పొట్లాలు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
భక్తుల సౌకర్యార్దం శ్రీశైల దేవస్ధానం నిర్వహిస్తున్న వివిధ పథకాలకు దాతలు విరాళాలను అందించారు. సోమవారం వనపర్తి జిల్లాకు చెందిన కేఎం పద్మావతమ్మ నిత్యాన్నదానం, గోసంరక్షణనిధి, ప్రాణదాన ట్రస్ట్నకు కలిపి రూ. 6.00 లక్షల చెక్ ఇచ్చారు. గుంటూరు వాసి కృష్ణారెడ్డి అన్నదాన పథకానికి రూ.1.00 లక్ష చెక్ ఆలయ పర్యవేక్షకులు రవికుమార్కు అందించారు. దాతలకు దేవస్ధానం అధికారులు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రం అందజేశారు.