Srisailam | భక్తులతో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున మహా పుణ్య క్షేత్రం కిటకిటలాడుతుంది. అక్టోబర్ 31న తొలి కార్తీక సోమవారం సందర్భంగా పరమ శివుడి దర్శనం కోసం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి యాత్రికులు శ్రీశైలానికి భారీగా తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో భక్తులకు స్వామి అమ్మవార్ల అలంకార దర్శనాల కల్పనలో ఎటువంటి ఇబ్బందులకు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో లవన్న అధికారులను ఆదేశించారు. భకుల రద్దీ అధికంగా ఉండటంతో పలు ఆర్జితసేవల్లో తాత్కాలిక మార్పులు చేసినట్లు చెప్పారు.
ఆదివారం తెల్లవారుజుమున కృష్ణా నదిలో పుణ్య స్నానాలు చేసుకుని కృష్ణమ్మకు పసుపు కుంకుమ సారెలు ఇచ్చి కార్తీక దీప దానాలు చేశారు. స్నానాల ఘాట్ వద్ద ప్రమాదాలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి తెలిపారు. చిన్నారుల పట్ల తల్లిదండ్రులు శ్రధ్ద వహించాలని ఆయన కోరారు.
భక్తులు కార్తీక దీపాలను వెలిగించడానికి ఆలయ ఉత్తర మాడవీధిలో, గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ ఏఈఓ హరిదాసు తెలిపారు. అదే విధంగా ప్రతి భక్తునికి లడ్డూ ప్రసాదాలు అందేలా విక్రయ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విద్యుద్దీప కాంతులతో అలరారుతున్న ఆలయ శోభను వీక్షిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశంలో మునిగి తేలుతున్నారు.
శ్రీశైలానికి వచ్చి వెళ్లే యాత్రికులు తమకు సహకరించాలని స్థానిక పట్టణ సీఐ దివాకర్ రెడ్డి కోరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులు సాక్షిగణపతి ఆలయం వద్ద రోడ్డుకు ఇరువైపులా వాహనాలను అడ్డంగా నిలిపివేసి ఆలయ దర్శనానికి వెళ్లారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. యాత్రికులు, తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగించకుండా సహకరించాలని కోరారు.
శ్రీభ్రమరాంబ మల్లికార్జునుల ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాత పుష్కరిణి వద్దకు వేంచేబు చేయించి ప్రత్యేక పుప్పాలంకరణతో లక్ష దీపార్చన నిర్వహిస్తున్నట్లు ఈఓ లవన్న తెలిపారు. కార్తీక మాసంలో పుష్కరిణి వద్ద మహిళలు దీపాలు వెలిగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మాసంలో ప్రతి సోమవారం పుష్కరిణి హారతి అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. ప్రత్యేక ఆకర్షణగా చేసే దశవిద హారతులను చూసేందుకు తెలంగాణ వాసులు ఎక్కువ ఆసక్తి చూపుతారని శ్రీశైలప్రభ సంపాదకుడు డాక్టర్ అనీల్ కుమార్ తెలిపారు.