Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుండి వివిధ ప్రాంతాల యాత్రికులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి. పాతాళగంగలో పుణ్య స్నానాలు చేసుకుని కృష్ణమ్మకు దీప దానాలు, చీరసారెలను సమర్పించుకున్నారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల్లో అలంకార దర్శనాలు మాత్రమే కల్పించారు. అయినా దర్శనానికి సుమారు మూడు గంటలకుపైగా సమయం పట్టింది.
క్షేత్ర పరిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో యాత్రుకులు కూడా సహకరించాలని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఆదివారం సాయంత్రం పౌర్ణమి ఘడియలు ప్రారంభమైన సందర్బంగా వచ్చిన యాత్రికుల ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించి స్వామివార్లను దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు దీరారు.
కార్తీక పౌర్ణమి సందర్బంగా భ్రమరాంబదేవి అమ్మ వారికి లక్ష కుంకుమార్చన, ఊయలసేవ, పల్లకిసేవ కార్యక్రమాలను జరిపించారు. అమ్మ వారికి ప్రీతికరమైన వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ఊయలలో వేంచేబుచేసి మహా సంకల్పం, ఖడ్గమాల, అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చన చేశారు.
ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్బంగా పాతాళగంగ వద్ద నెలకొల్పిన కృష్ణవేణి నదీమాతల్లి విగ్రహానికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం సంప్రదాయబదంగా కృష్టమ్మకు పసుపు కుంకుమ, గాజులతో చీరసారెలను సమర్పించి గంగ హారతులను ఇచ్చారు. అర్చక వేద పండితుల మంత్రోచ్చారణతో ఏక హారతి, నేత్ర హారతి, బిల్వహారతి, నాగహారతి, పంచహారతి, పుష్పహారతి, నందిహారతి, సింహహారతి, నక్షత్రహారతి, విష్ణుహారతి, కుంభహారతులతో ఏకాదశ గంగాహరతులను నివేదించారు.
పౌర్ణమి ప్రదోషకాలంలో ఆలయ ప్రధాన వీధిలో గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయంగా దాతలు అందించిన నూలు వత్తులను ఆవునెయ్యితో తడిపి ఎత్తైన స్తంభాలపై వేలాడించి దీప ప్రజ్వలన చేశారు. త్రిపురాసురుణ్ని సంహరించిన తరువాత పరమేశ్వరునికి దృష్టి దోష పరిహారం కోసం.. విజేయుడైన శుభవేళలో పార్వతీ దేవి తొలుతగా జ్వాలాతోరణం జరిపించినట్లు పురాణ ఇతిహాసాల ప్రవచనాలను భక్తులు ఆద్యంతం వింటూ దీప కాంతులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజుతోపాటు ఏపీ సాంస్కతిక మరియు పర్యాటక శాఖ మంత్రి రోజా, దేవాదాయ కమీషనర్ సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారిచక్రపాణి రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కార్తీక మాసంలో పౌర్ణమి సందర్బంగా ఆలయ పుష్కరిణి వద్ద స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దశవిధ హారతులు ఇచ్చారు. అనంతరం లక్షదీపోత్సవం జరిపించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికుల ప్రతి ఒక్కరూ కార్తీక దీపాలను వెలిగించుకునే అవకాశాన్ని కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.