TTD | తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు గురువారం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అలరించారు. అంతకుముందు ఉదయం 6.30 గంటలకు మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు.
అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మలయప్ప స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కన్నులపండుగగా జరిపారు. సాయంత్రం మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్ధమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.