Jogi Ramesh | ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేశ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని తన నివాసంపై టీడీపీ శ్రేణుల దాడి నేపథ్యంలో భద్రత కల్పించాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం కాసేపట్లో విచారణ చేపట్టనుంది.
మరోవైపు జోగి రమేశ్ కుమారుడు జోగి రోహిత్ కుమార్ కూడా ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ నివాసంపై దాడి జరిగే అవకాశం ఉందని, ముందుగానే పోలీసులకు సమాచారం అందించినా వారు స్పందించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. తమ ఇంటిపైకి గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేశారని.. ఆ సమయంలో పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారే తప్ప అడ్డుకోలేదని ఆరోపించారు. దాడి ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆధారాలతో సహా సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తమకు, తమ కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని, వెంటనే భద్రత కల్పించాలని కోరారు.